YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల పాటు కస్డడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇటీవల భాస్కరరెడ్డి, అంతకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. నిందితులను పది రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టులో గట్టి వాదనలు వినిపించింది. వివేకాతో భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయని తెలిపింది. హత్య కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలది కీలక పాత్ర అని, వారిద్దరు దగ్గర ఉండి సాక్ష్యాలను చెరిపివేయించడమే కాక సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ వెల్లడించింది.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి భాస్కరరెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి కృషి చేశారన్న సీబీఐ.. దీనిపై వివేకా ఆగ్రహంతో ఉండేవారని పేర్కొన్నారు. మరో పక్క నిందితులు భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాదులు సీబీఐ వాదనలను వ్యతిరేకించారు. సీబీఐ కొందరినే లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తొందని ఆరోపించారు. ఇద్దరూ వేర్వేర వాదనలు వినిపించారు. అసలు నిందితుల్ని పట్టుకోకుండా దర్యాప్తును సీబీఐ పక్కాదారి పట్టిస్తొందని ఆరోపించారు. నిందితులు ఇప్పటికే తమకు తెలిసిన సమాచారం అంతటినీ సీబీఐకి చెప్పినందున ప్రత్యేకంగా కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. రిమాండ్ పిటిషన్ లోని అంశాలనే కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారనీ, అసలు కస్టడీ ఎందుకు అవసరమో చెప్పలేదన్నారు.
సీబీఐ మొదటి రెండు చార్జిషీట్ లలో భాస్కరరెడ్డి ప్రస్తావన లేదనీ, తప్పుడు సాక్ష్యాలతో సీబీఐ ఇరికించే ప్రయత్నం చేస్తొందని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశించిన సమయం దగ్గర పడుతోందనే అరెస్టులు చేస్తున్నారు తప్ప అధారాలను సేకరించడం లేదని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిన్న తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్ది సేపటి క్రితం ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలతో రేపటి నుండి ఈ నెల 24వరకూ ఉదయ్, భాస్కరరెడ్డిలను సీబీఐ ప్రశ్నించనున్నది.
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా .. హైకోర్టులో వాడివేడిగా వాదనలు