ఏపీలో రాజకీయాలు సలసల మరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. సీఎం జగన్ను అధికారం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు చేతులు కలిపాయి. కూటమిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేనలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇది ఒకరకంగా వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశమే. అయినా.. ఎక్కడా అలాంటిది కనిపించడం లేదు. పైగా.. వైసీపీకి ఎక్కడా స్టార్ క్యాంపెయినర్లనూ పెట్టుకోలేదు. కూటమి పక్షాన చూసుకుంటే.. నందమూరి బాలయ్య స్వర్ణాంద్ర సాకార యాత్ర చేస్తున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలానూ ప్రజాభిమానం.. అభిమానులు ఎక్కువగా ఉన్న నాయకుడు.
అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ అందరికీ తెలిసిందే. విజన్ ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక, బీజేపీ పక్షాన ప్రధాని మోడీ బరిలోకి దిగుతున్నారు. ఇంకా చాలా మంది నాయకులు కూడా రంగంలోకి రానున్నారు. ఇది ఒకరకంగా వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగించే సందర్భం. కానీ, అలాంటి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారో.. ఏమో తెలియదు. మొత్తానికి చాలా ధీమాగా, ధైర్యంగా ఉన్నారు. అంతేకాదు.. `మంచి చేశామని అనుకుంటేనే ఓటు వేయండి` అని ఇప్పటికీ సీఎం జగన్ చెబుతున్నారు. దీంతో కూటమి బలమా? జగన్ బలవంతుడా? అనేది ప్రశ్నగా మారింది.
మరీ ముఖ్యంగా కూటమి పక్షాన అధికారికంగా మేనిఫెస్టో ప్రకటించకపోయినా.. చంద్రబాబు పదే పదే సూపర్ 6ను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏ డిజిటల్ మాద్యమాన్ని ఓపెన్ చేసినా.. సూపర్ 6 ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంచలన హామీతోపాటు.. నెల నెలా రూ.1500 ఇస్తామని.. మాతృవందనం పేరుతో రూ.15000 ఇస్తామని.. రైతులకు ఏటా 20000 ఇస్తామని.. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు వంటివారికి ప్రాణప్రదంగా మారిన పింఛనును రూ.4000 లకు పెంచుతామని చంద్రబాబు చెబుతున్నారు. అదేసమయంలో మెగా డీఎస్సీపై నే తొలి సంతకం చేస్తామని కూడా చెప్పారు.
ఇవన్నీ.. విన్నాక..కన్నాక.. సహజంగానే అధికార పక్షంలో ఉండి.. ఒంటరి పోరు చేస్తున్న పార్టీ ఏదైనా.. అలెర్ట్ కావాలి. అంత కుమించిన పథకాలు.. నగదు అందించే స్కీమ్లను ప్రకటించాలి. కానీ, ఇక్కడున్నది జగన్ అని వైసీపీ నాయకులు అన్నట్టు గా.. సీఎం జగన్ ఈ కూటమి సూపర్ 6ను అసలు పట్టించుకోలేదు. ఎక్కడా మెరుపులు లేని మేనిఫెస్టోనే ప్రకటించారు. పాత పథకాలనే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అత్యంత కీలకమైన పింఛనును కూడా ఇప్పుడు పెంచేది లేదన్నారు. ఎప్పుడో 2028లో అది కూడా 250 రూపాయలు పెంచుతామని చెప్పారు. అంటే.. దీని కోసం మూడేళ్లు ఆగాలి.
దీనిని సామాజిక పింఛను దారులు ఎలా తీసుకుంటారనేది పక్కన పెడితే.. ప్రకటించేందుకు జగన్ ఎంత ధైర్యం చేశారన్నది ప్రశ్న. అంటే.. మొత్తంగా ఆయన కూటమిని పట్టించుకోవడం లేదా? లేక.. కూటమి తనకు పోటీ కాదని భావిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.