Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత , నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియోజకవర్గం నగరి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. తనదైన శైలిలో అభివృద్ధి , రాజకీయాలతో రోజా మూలంగా ఈ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కే సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఇంకో పరిణామంతో ఈ ఫైర్ బ్రాండ్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. నగరి నియోజకవర్గంలోని పార్టీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు పూనుకుంది.
నగరిలో కలకలం …
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీలో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. నగరి నియోజకవర్గ పరిధిలోని ఐదుగురు వైసీపీ నాయకులపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తడుకుకు చెందిన ముప్పాళ్ల రవి శేఖర్ రాజా, వై. బొజ్జయ్య పార్టీ నుంచి తొలగించింది. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రురు పంచాయతీకి చెందిన యం.కిషోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజాపై సస్పెన్షన్ వేటు వేస్తూ వైసీపీ ఆదేశాలు జారీ చేసింది.
కర్నూలులో ఏం జరుగుతోందంటే…
మరోవైపు కర్నూలు జిల్లాలో అక్రమ ఇసుక వ్యవహారం దాడులు, ప్రతి దాడులకు దారి తీస్తుంది. అక్రమ ఇసుకపై సమాచారం ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. కర్నూలు మండలం నిడ్జూరులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడని వైసీపీ కార్యకర్త నారాయణపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ వర్గీయులు దాడి చేశారు. నారాయణ వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడుల్లో ఇరువర్గాలు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని సైతం వైసీపీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.