ఏపిలో నిన్న మొన్నటి వరకూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసం హాట్ టాపిక్ గా మారి రాజకీయ వివాదానికి తెరలేపింది. ఈ అంశంతో అధికార వైసీపీ టార్గెట్ గా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసింది. హిందూత్వ ఎజండాతో రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టడానికి రామతీర్థం ఘటనను వాడుకోవాలని ప్రయత్నించింది. ప్రతిపక్షాల విమర్శలను అధికార పక్షం తిప్పికొడుతూనే హిందూ మతానికి తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది తెలియజెప్పేందుకు గత టీడీపీ హయాంలో విజయవాడలో తొలగించిన ఆలయాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి శంకుస్థాపన కార్యక్రమాలను ప్రభుత్వం చేసింది. ఆలయాల పునః నిర్మాణాలకు చర్యలు తీసుకున్నప్పటికీ హిందూ ఆలయాలలో జరిగిన వరుస సంఘటనలు వైసీపీ ప్రభుత్వాన్ని కొంత ఇరుకున పెట్టాయి. ఈ వివాదాలలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వంపై పైచేయి సాధించినట్లుగా పరిశీలకులు భావించారు. ఈ వివాదాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న ఆ సమస్య మరుగున పడింది.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేయడం, దానిపై ప్రభుత్వం కోర్టుల వరకూ వెళ్లడం చివరకు హైకోర్టుకు ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావడం, దానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా వార్ మొదలైంది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా చూపి ఎన్నికల వాయిదాకు ప్రభుత్వం ప్రయత్నిస్తునే ఉద్యోగ సంఘాల చేత ఎస్ఈసీపై వార్ కు పురి గొల్పింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తమ పదవీ కాలం పూర్తి అయ్యే లోపు ఈ ఒక్క ఎన్నిక అయినా పూర్తి చేసి దిగిపోవాలన్న పట్టుదలతో ఉండగా అసలు నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలకు వెళ్లకూడదన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలకు వెళితే గత పరిణామాల నేపథ్యంలో నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు చేస్తారనీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నతాధికారులను బదిలీ చేయడంతో పాటు ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ టార్గెట్ గా మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రజల్లోనూ నిమ్మగడ్డ వ్యవహారాల శైలి పలుచన చేసేలా 2018 నుండి ఎన్నికలు నిర్వహించకుండా ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ సమయంలో మరో రెండు నెలలో వెళ్లిపోతున్న తరుణంలో ఎన్నికలకు ఎందుకు తొందరపడుతున్నాడు అంటూ విమర్శలు సంధిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నాడని ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలిగారు. కాకపోతే పైకి తెలియకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి మేలు చేసినట్లు అయ్యింది. ఎందుకంటే ఇటీవల కాలం వరకూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు రాగా ఈ అంశంపైనే మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. స్థానిక ఎన్నికల అంశం తెరపైకి రావడంతో విగ్రహాల ద్వంసం అంశం మరుగున పడిపోయి జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పంచాయతీ హాట్ టాపిక్ అయ్యింది. రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా మొత్తం దృష్టి ఎన్నికల వివాదంపైనే కేంద్రీకృతమైంది. స్థానిక సంస్థల ఎన్నికల అంశం కాస్త వైసీపీకి ఇబ్బంది అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హిందూత్వ అంశం మరుగునపడటం కాస్త ఊరట ఇచ్చినట్లు అయ్యింది. దీనికి తోడు ఎన్నికల పంచాయతీ నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత సింపతీ కూడా వచ్చిందంటున్నారు.