Lock Down: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్వేవ్ కల్లోలం సృష్టిస్తే.. సెకండ్ వేవ్ విశ్వరూపమే చూపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ కేసులు అదుపులోకి రాకపోవడంతో.. లాక్డౌన్కు వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలుగులోకి వచ్చింది.
హైకోర్టు ఆగ్రహం…
కోవిడ్ కేసులు పెరుగుతున్నా ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ప్రభుత్వంపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ విధిస్తారా? కర్ఫ్యూ అమలు చేస్తారా? లేదా తామే ప్రకటన చేయాలా? అంటూ ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూపై ప్రకటన రాగా.. అది ఈ నెల 30తో ముగియనుంది. ఇక, ఆ తర్వాత లాక్డౌన్కే సర్కార్ మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హోమ్ సెక్రటరీ , డీజీపీ సహా పలువురు కమిషనర్లు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఈ నెల 30వ తేదీ తర్వాత లాక్డౌన్ పెట్టే యోచనపై ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించిందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో.. లాక్డౌన్ పై ఎప్పుడైనా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
హోం మంత్రి క్లారిటీ
ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్ అలీ క్లారిటీ ఇస్తూ లాక్డౌన్పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులో చర్చించాం.. లాక్ డౌన్ పెట్టాలా లేదా అన్నది మాత్రం సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారన్న ఆయన సమీక్ష తర్వాత లాక్ డౌన్పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని.. కానీ, లాక్ డౌన్ పెట్టడం సీఎంకు ఇష్టం లేదని అన్నారు.