ఏపిలో స్థానిక సంస్థల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ అన్నట్లుగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నందున ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరో పక్క ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై ముద్రగడ విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ చేస్తున్న దాడి మీడియా ద్వారా చూస్తున్నాన్న ముద్రగడ..ఎన్నికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నిర్వహించడానికి తమరు ప్రయత్నించాలి గానీ రాజకీయ నాయకులుగా పట్టుదలకు పోవడం మంచిది కాదని సూచించారు. గతంలో ఎన్టీఆర్ చిత్రంలో నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా మిమ్మల్ని ఎవరో అదృశ్య శక్తి వెనుక ఉండి ఈ తలనొప్పులు ఇప్పిస్తున్నారని నా లాంటి వారికి అనుమానం కలుగుతోందని అన్నారు. చాలా పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో ఉద్యోగాలో ఉంటూ రాజకీయాలు చేయడం మంచిగా లేదని అన్నారు. ఈ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ ఇలా రచ్చ చేయడం మానండి అంటూ సలహా ఇచ్చారు ముద్రగడ.
ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటి సారిగా చూస్తున్నామన్నారు. ఎస్ఈసీకి ఉన్న అధికారాలతో సంస్కరణలు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులు గుండె మీద చేయి వేసుకుని లిక్కరు, డబ్బు లేకుండా ఎన్నికలు చేశామని చెప్పగలరా అని ప్రశ్నించారు. వాటిపై ఏ అధికారి దృష్టి పెట్టరనీ, ప్రకటనల వరకే పనిచేస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించి ఏ చర్యలు తీసుకోరని ఆక్షేపించారు.
రాష్ట్ర ప్రభుత్వం, తమరు పట్టుదలతో తగవులు పడి న్యాయస్థానాలలో వాదించడానికి న్యాయవాదులను నియమించడానికి ఇరువురు ఖజానాను కొల్లగొడుతున్నారని అన్నారు ముద్రగడ. ప్రభుత్వ ఖజానలోని డబ్బు ప్రజలు కష్టార్జితంతో కట్టిన పన్నులు అన్న సంగతి మరవద్దని హితవు పలికారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలే గానీ పంతాలు పట్టింపులకు కాదన్న సంగతి తమరికి తెలియంది కాదని అన్నారు. బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ విషయాలపై లేఖ రాసినట్లు ముద్రగడ పేర్కొన్నారు.