కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్న జరిగింది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటికి ఓ దుండగుడు భవానీ మాలధారణ వేషంలో బిక్ష కోసమని వచ్చాడు. శేషగిరిరావు బయటకు వచ్చి అతని సంచిలో బిక్ష వేస్తుండగా, ఆయనతో మాటలు కలిపి తన వెంట తెచ్చిన కత్తిని బయటకు తీసి శేషగిరిరావుపై దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన శేషగిరిరావు బిగ్గరగా కేకలు వేశాడు. దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో చేయి అడ్డుపెట్టడంతో చేయికి గాయం అయ్యింది. శేషగిరిరావు కేకలు విన్న ఇంట్లోని వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు అక్కడకు వచ్చారు. దీంతో హత్యాయత్నంకు పాల్పడిన వ్యక్తి బైక్ పై సిద్దంగా ఉన్న తమ మనుషులతో పరారైయ్యాడు.
ఈ ఘటనలో గాయపడిన శేషగిరిరావును కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ శేషగిరిరావు ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరు. ఎందుకు దాడి చేశాడు అనే విషయాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించి దాని
ఆధారంగా నిందితుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.