Nimmagadda Ramesh : ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోమారు అనూహ్య రీతిలో వార్తల్లోకి ఎక్కారు.
తాజా పరిణామంలో ఆయన్ను ప్రభుత్వం తరఫున ఉత్కంఠలో ఉంచుతారా? లేకపోతే పరిష్కారం చూపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ చేసుకున్న దరఖాస్తును స్థానిక వీఆర్వో తిరస్కరించడం, తదనంతర పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి.
నిమ్మగడ్డ ఏం కోరారు?
తన పదవీ విరమణ తర్వాత దుగ్గిరాలలోనే ఎక్కువగా గడుపుతానని ఓటు హక్కు కల్పించాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఓటును సరెండర్ చేసినట్టు ఆ ఆధారాలను కూడా జత చేశారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానికంగా ఉండడం లేదని ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు నిమ్మగడ్డ. అక్కడి నుంచి కూడా గ్రీన్సిగ్నల్ రాకపోతే కోర్టుకు వెళ్తానని ఆయన తెలిపారు.
కలెక్టర్ ఏమంటున్నారు ? : Nimmagadda
నిమ్మగడ్డ ఓటు హక్కు విషయంపై గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ చేసుకున్న దరఖాస్తును స్థానిక వీఆర్వో తిరస్కరించారని తెలిపారు. దీనిపై విచారణ జరుగుతుందని… విచారణ అనంతరం ఓటు హక్కు కల్పించాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడవ విడతలో దుగ్గిరాల మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు దీనిపై నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నిక జరిగే సమయం వరకు వేచి చూస్తారని తెలుస్తోంది.