Nimmagadda Ramesh : ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ ఏపీ సర్కారు మధ్య జరుగుతున్న అధికార యుద్ధంలో కీలక పరిణామం. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి మొదలైన ఈ గేమ్ పర్వం రానురాను ముదురుపాకాన పడుతోంది.
తాజాగా అది మరింత పీక్స్ కు చేరింది. ఎన్నికల వ్యవహారంలో వరుసగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు లేఖలు రాస్తూనే ఉన్న నిమ్మగడ్డ… గవర్నర్కు లేఖ రాయడాన్ని వైసీపీ సర్కార్ జీర్ణించుకోలేకపోయింది. మంత్రులు బొత్స, పెద్దరెడ్డితో పాటు మరుకొందరు లేఖలో హద్దు దాటుతున్నారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఏపీ స్పీకర్ సీరియస్ గా స్పందించారు.
Nimmagadda Ramesh : మమ్మల్నే అంటారా?
మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ హద్దు దాటుతున్నారంటూ ఎస్ఈసీ ఫిర్యాదు చేయడంపై ఇరువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్పై సభాహక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ పై వచ్చిన ఫిర్యాదు పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదుపరి చర్యలు ప్రారంభించారు. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు చేశారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే నిమ్మగడ్డకు షాక్ …
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే ప్రభుత్వం తన మార్కు షాక్ ఇచ్చింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేయాలని ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు. దీంతో ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా నిమ్మగడ్డను ఇరుకున పెట్టే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా తాము రాజ్యాంగం ప్రకారం స్పందించే అవకాశం నిమ్మగడ్డ ఇచ్చారని వైసీపీ వర్గీయులు భావిస్తున్నట్లు టాక్.