Ration Door Delivery: ఏపిలో నిత్యావసరాల డోర్ డెలివరీ అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశంలో మొట్టమొదటి సారిగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు. వాహన డ్రైవర్ లకు మొదట రూ.16 వేల వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే తమకు పని భారం ఎక్కువైందనీ, ఈ వేతనాలకు తాము పని చేయలేమంటూ వాహన ఆపరేటర్ లు ఆందోళన నిర్వహించడంతో మరో రూ.5వేలు పెంపు చేసింది. నెలకు 21వేలు వారికి చెల్లింపు జరుపుతోంది.
అయితే ప్రభుత్వం ఆర్భాటంగా డోర్ డెలివరీ ప్రారంభించినా వాహన ఆపరేటర్ లు ఒక బజారులో వాహనాన్ని నిలుపుదల చేసి అక్కడే ఆ బజారు వారందరికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏదో విధంగా పంపిణీ జరుగుతుంది కదా అంటూ అధికారులు డోర్ డెలివరీపై అంతగా ఒత్తిడి చేయడం లేదు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీని ప్రకటించింది.
మే, జూన్ మాసాలకు అయిదు కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోంది. దీంతో ఎక్కువ మొత్తంలో బస్తాలను వ్యాన్ లో వేసుకోవాల్సి రావడంతో పాటు కరోనా విజృంభణ భయంతో వాహన డ్రైవర్ లు రేషన్ పంపిణీకి మొగ్గుచూపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాహన డ్రైవర్ లు తాము పంపిణీ చేయలేమంటూ అధికారులకు తేగేసి చెప్పారు. దీంతో అదికారులు పలు ప్రాంతాల్లో డీలర్ లపై ఒత్తిడి చేసి రేషన్ షాపుల లోనే విఆర్ఒ లాగిన్ లో సరుకుల పంపిణీ చేస్తున్నారు.
Ration Door Delivery: వాహనాలను అధికారులకు అప్పగించిన గుంతకల్లు ఆపరేటర్ లు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని 20మంది వాహన ఆపరేటర్ లు తమ వాహనాలను తహశీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.21వేలు డీజిల్, ఇఎంఐ, హమాలీ చార్జీలకే సరిపోతుందనీ, ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ అందట్లేదని పేర్కొంటూ వాహనాలను అప్పగించారు. వెట్టి చారికీ తప్ప తమకు ఎలాంటి లాభం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వాహనాలకు ఖర్చు పెట్టిన పది శాతం నగదు రూ.70వేలు తిరిగి ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని గుంతకల్లు ఆపరేటర్లు అధికారులకు విన్నవించారు.
సోమవారం రేషన్ డీలర్ల నిరసన
వాహన ఆపరేటర్ల సహాయ నిరాకరణ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు డీలర్ లపై ఒత్తిడి తీసుకు వచ్చి పంపిణీ చేయిస్తున్నారు. మోటారు డ్రైవింగ్ యూనిట్లు చేయాల్సిన రేషన్ పంపిణీని డీలర్లు చేయాలని ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. రేషన్ డోర్ డెలివరీ పై విజిలెన్స్ విచారణ జరిపాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టీకా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మోటారు డ్రైవింగ్ యూనిట్లు (ఎండియు) పని చేయని ప్రాంతాల్లో డీలర్ లాగిన్ తో పంపిణీ చేయడానికి తమకు అభ్యంతరాలు లేవనీ, అందుకు ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయాలని సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ అని పేరు పెట్టినా ఆ విధంగా పంపిణీ మాత్రం జరగడం లేదు.