తెలంగాణ లో అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్రంలో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారా? అనే సందేహం రావడం సహజమే.
ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా జరుగుతోంది మాత్రం ఇదేనని అంటున్నారు. ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక ఘట్టం గురించి. అయోధ్య లో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కామెంట్ల కలకలం..
అయోధ్య రామాలయానికి విరాళాల పేరుతో కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఘాటుగా స్పందించారు. నిధులు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చిన కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా..? అని ప్రశ్నించిన ఆయన.. తామంతా శ్రీరాముని భక్తులమేనని టీఆర్ఎస్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
విరుచుకుపడ్డ విజయశాంతి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. విరాళాన్ని భిక్షం అంటూ ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని ఎద్దేవా చేశారు. దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆర్ఎస్ నేతలకే చెల్లు అని కామెంట్ చేశారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అంటున్న ఆ టీఆర్ఎస్ నేత ఇళ్ళలోనే పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్ళకు , పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అది చాలక అయోధ్య రామాలయానికి విరాళాలివ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని విరుచుకుపడ్డారు. తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్ళకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి అంటూ జోస్యం చెప్పారు.