TDP Leaders House Arrest: ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు మహాపాదయాత్రలో పాల్గొనడానికి వీలులేదనీ, రాజకీయ ప్రసంగాలు చేయడానికి వీలులేదంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆంక్షల మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం నాగులుప్పలపాడు నుండి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైంది. మద్దిపాడు మీదుగా రాత్రికి ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చేరుకుంటుంది. రైతుల పాదయాత్ర రూట్ లో భారీగా పోలీసులను మోహరించారు. పాదయాత్రను కవర్ చేయడానికి వచ్చిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.
TDP Leaders House Arrest: పోలీసు ఆంక్షల మధ్య కొనసాగుతున్న పాదయాత్ర
ఓ పక్క వర్షం కురుస్తున్నా రైతులు గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నాగులుప్పలపాడు వెళ్లే మార్గంలో రహదారులను దిగ్బంధం చేసి పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో ప్రభుత్వం భయపడుతోందనీ, అందుకే ఆంక్షలు పెడుతోందని జేఏసి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొనసాగుతున్న పాదయాత్రకు వివిధ గ్రామాల నుండి రైతులు, ప్రజలు స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తున్నారు.
ఏలూరి, గొట్టిపాటి హౌస్ అరెస్టు
ప్రకాశం జిల్లాలో పాదయాత్ర ప్రారంభం అయినప్పటి నుండి పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. కాగా పాదయాత్రలో రాజకీయ నాయకులు పాల్గొనడానికి వీలులేదంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలులో సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్ తదితర టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మరో పక్క టీడీపీ జిల్లా నేతల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో పాదయాత్ర నిర్వహకులపై మూడు కేసులను నమోదు చేశారు. పరిమితికి మించి పాదయాత్రలో పాల్గొంటున్నారనీ, కోవిడ్ నిబంధనలు పాటించడం లేదనీ, లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు చేశారంటూ కేసులు నమోదు చేశారు. మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలంటూ వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాశారు.