TDP MP Kanakamedala Ravindra Kumar: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. అధిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగింపునకు కేంద్రం అనుమచించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలల చొప్పున రెండు సార్లు ఎక్స్ టెన్షన్ తీసుకున్నారు. అదే తరహాలో ఆదిత్యనాథ్ దాస్ విషయంలో పదవీ కాలాన్ని పొడిగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి లేఖ రాసిన రవీంద్ర కుమార్.. ఆదిత్యనాథ్ దాస్ పదవీ పొడిగింపు సరికాదని పేర్కొన్నారు. నేరారోపణలు ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఎలా పొడిగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన వారికి పదవీ కాలం పొడిగింపు తగదని పేర్కొన్న రవీంద్ర కుమార్… జగన్ పై ఉన్న సీబీఐ కేసుల్లో అదిత్యనాథ్ దాస్ పై కూడా తీవ్ర నేరారోపణలు ఉన్నాయన్నారు. అదిత్యనాథ్ దాస్ జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో అభియోగాలు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.
Read More: Tdp Ex minister: మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు..!!
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఇండియా సిమెంట్స్ లో జగన్ పెట్టుబడులు పెట్టారనీ, అప్పట్లో ఇండియా సిమెంట్స్ కు ఆదిత్యనాథ్ దాస్ అనధికారికంగా నీటిని కేటాయించారని ఆరోపించారు. నాడు జగన్ తో పాటు అదిత్యనాథ్ దాస్ పైనా సీబీఐ కేసు నమోదు చేసిందని కేంద్రానికి రాసిన లేఖలో రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. అయితే కేంద్రం ఈ లేఖను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.