విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సీనియర్ సిటిజన్ల ఓటు బ్యాంకు 32 శాతానికి పైగా ఉంది. దీనిలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సంఘం లెక్కే చెబుతోంది. ఒకప్పుడు వీరంతా.. సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు అండగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కడ వాకింగ్ చేసినా.. ఏ పార్కులో కూర్చున్నా.. గద్దె గురించి పాజిటివ్గా మాట్లాడుకునేవారు.
కానీ, అదేంటో గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు.. ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. “ గద్దె సీనియర్ నాయకుడు. ఈ విషయంలో మాకు డౌట్ లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త నీటికి దారి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన అనారోగ్యంతోనో.. ఇతర కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ, ఇప్పుడు నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. యువ నేతలకు ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉంది “ అని ఏ ఇద్దరు సీనియర్ సిటిజన్లు కలుసుకున్నా.. ఇదే మాట చెబుతున్నారు.
అంతేకాదు.. యువ నాయకులకు పార్టీలకు అతీతంగా జై కొడుతున్నవారు కూడా పెరుగుతున్నారు. వైసీపీ తరఫున ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. ఈయన ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్లతో భేటీ కాలేదు. ఇతర వర్గాలను మాత్రమే కలుస్తున్నారు. కానీ, తాను స్పృశించని సీనియర్ సిటిజన్ల దగ్గర కూడా.. అవినాష్కు మార్కులు పడుతుండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. గత ఐదేళ్ల కాలంలో గద్దె నియోజకవర్గానికి దూరం కావడమే.
కారణాలు ఏవైనా.. ఆయన ప్రజలలోనూ.. ముఖ్యంగా తనకు ఇప్పటి వరకు అంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంలోనూ సింపతీని పోగొట్టుకున్నారనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. అందుకే. ఇక్కడ ఎప్పుడూలేని విధంగా మార్పు దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
యువ నాయకుడిగా ఉండి.. కొండలు ఎక్కుతూ.. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తూ.. నిత్యం ప్రజల్లోనే ఉంటున్న అవినాష్.. వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇంకా చిత్రమేంటంటే.. నియోజకవర్గంలో చాలా మంది తమ ఎమ్మెల్యే గద్దెను చూసి ఐదేళ్లయిందని చెబుతుండడం. ఇది అవినాష్కు కలిసి వస్తున్న అంశంగా పేర్కొంటున్నారు పరిశీలకులు.