తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం 8 నుండి పది గంటల వరకూ శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ వాహనాన్ని మోసి తన భక్తిని చాటుకున్నారు.
సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల వరకూ స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామివారు కటాక్షిస్తారు. శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథన్ని లాగారు. రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ధర్మారెడ్డి దంపతులు, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్