Tirupathi By Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ఆమోదించారు. నామినేషన్ అఫిడవిట్ లో తనపై ఉన్న పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను రత్నప్రభ తెలియజేయలేదంటూ జేడీయూ నేత రమణ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై అయిదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, సైఫాబాద్, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు నమోదై పెండింగ్ లో ఉన్నాయని రమణ వివరించారు. అదే విధంగా రత్నప్రభ తన నామినేషన్ పత్రంలో కులదృవీకరణ పత్రాలను సమర్పించలేదని కావున ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని రమణ కోరారు. అయితే బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై ఆరోపణలు చేసిన జేడీయూ నేత రమణ వాటికి సంబంధించిన ఆధారాలను చూపడంలో విఫలం అయినందున ఆమె నామినేషన్ ను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు.