కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీలో గ్రూపు విబేధాలు మరో సారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా గ్రూపుల మధ్య విబేధాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం బాపులపాడు మండలంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అధికార పార్టీలోని ఓ వర్గం షాక్ ఇచ్చింది.
బాపులపాడు మండలం మల్లవల్లిలో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అధికారులు సమాచారం ఇచ్చారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనా ప్రస్తుతం వంశీ వైసీపీ అసోసియేట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వంశీ వస్తుండటంతో మల్లవల్లిలోని వైసీపీలోని ఓ వర్గం అడ్డుకుంది.
గ్రామస్తులు రోడ్డుపై భైటాయించి వంశీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గీయుల నినాదాలతో మల్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తుల నిరసనతో వంశీ వెనక్కి వెళ్లిపోయారు.