సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటం నుండి విరమించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రతిపాదనకు స్వస్తిపలికారు. ఎంతో కాలంగా రజనీ రాజకీయ ప్రవేశంపై ఊహగానాలు వస్తూనే ఉన్నాయి. తమిళనాట లక్షలాది మంది అభిమానులు రజనీ రాజకీయాలలోకి రాకపై వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలిసిందే. ఈ నెల 31వ తేదీ రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని, జనవరిలో పార్టీ నిర్మాణం గురించి వెల్లడిస్తానని ఇటీవల తలైవా ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని కల్గించింది. అయితే రజనీ నాలుగు రోజుల క్రితం హైబీపితో తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ నేడు కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పార్టీ ప్రారంభించలేనంటూ మూడు పేజీల సుదీర్ఘ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదని రజనీ తేల్చి చెప్పేశారు. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం పై తనను క్షమించాలని అభిమానులను కోరారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. రాజకీయ ప్రకటనకు ముందు అసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్లు రజనీ లేఖలో పేర్కొన్నారు. అయితే రజనీ ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురైయ్యారు.