Visakha Steel plant : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరో లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఏపి సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన సందర్భంలో గంటా శ్రీనివాసరావు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి లేఖ రాసిన సంగతి తెలిసిందే. నేడు సిఎం జగన్ కు గంటా మరో లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ను మరింత బలోపేతం చేసేందుకు జగన్ సూచనలు చేయడాన్ని గంటా స్వాగతించారు. స్టీల్ ప్లాంట్ అంశం పై చర్చించి తీర్మానం ఆమోదించేందుకు తక్షణం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ను గంటా కోరారు. అదే విధంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్న వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గంటా శ్రీనివాసరావు లేఖలో సీఎం జగన్ ను కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రాజీనామా లేఖను ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు.