Visakha Steel : గంటా శ్రీనివాసరావు ganta srinivasa rao రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు తెలిసిన పేరు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుతం విశాఖ టీడీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఓటమి అనేది లేకుండా నియోజకవర్గాలు మారుతూ గెలుస్తూ వస్తున్న నాయకుడు. ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ గ్రూపు మెయింటెన్ చేసే నాయకుడు. గడచిన ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైనా వైసీీపీ ఫ్యాన్ గాలిలో సైతం టీడీపీ తరపున పోటీ చేసి విశాఖలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి సైలెంట్ గానే ఉన్నారు. వైసీీపీలో చేరికకు ప్రయత్నాలు జరిగాయి. పలు మూహూర్తాలు పిక్స్ అయినట్లు వార్తలు వచ్చినా ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రి, అధికార పార్టీ రాజ్యసభ్యుడు మోకాలు అడ్డుపెట్టడంతో వైసీపీలో చేరిక ఆగిపోయింది. దాదాపు 20 నెలలుగా సైలెంట్ గా ఉన్న గంటా ఇప్పుడు బయటకు వచ్చారు. అందుకు ఆయనకు ఒక వేదిక దొరికింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం అటు ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్ర ప్రజానీకానికాన్ని ఆందోళన కల్గిస్తోంది.
Visakha Steel : రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకున్న కర్మాగారం ప్రైవేటు పరం అవ్వనున్నదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ప్రాంతాలకు అతీతంగా బాధపడే విషయమే. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఎవరు ముందు ఉండి పోరాడతారు అని అందరూ ఆసక్తగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ కర్మాగారాన్ని ప్రైవేటు పరం అవుతుందనే వార్త రాష్ట్ర ప్రజానీకాన్ని అంతటినీ విస్మయానికి గురి చేస్తోందన్నారు. విశాఖ అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని పేర్కొన్న గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ కర్మాగారం ప్రైవేటీకరణ నిరోధానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
రైతు ఉద్యమం కంటే ఎక్కువగా తీవ్రమైన పోరాటం
కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఢిల్లీలో రైతుల ఉద్యమం కన్నా తీవ్రంగా ఉంటుందని గంటా హెచ్చరించారు. గతంలో వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయించాలని ప్రయత్నిస్తే నాడు ఎంపిగా ఉన్న తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. కర్మాగారానికి సొంత గనులు లేవన్న కారణంతో వంద శాతం ప్రైవేటు పరం చేయాలని ఆలోచన చేయడం దారుణమని అన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రతి ప్రజాప్రతినిధి తమ పదవులకు రాజీనామాలు చేయాలని కూడా కోరారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
సీఎం జగన్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంత కాలం సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించాలని భావిస్తూ వైసీపీ ప్రజా ప్రతినిధులను రాజీనామా చేయాలని కోరడంతో విశాఖ పరిణామాలపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారని అంటున్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటించిన వైఎస్ జగన్ రేపో మాపో అక్కడ క్యాంప్ కార్యాలయం ప్రారంభించుకుని పరిపాలన సాగించాలని అనుకుంటుంటే అక్కడ విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుండటం కొంత ఇబ్బందికర పరిస్థితేనని పరిశీలకులు అంటున్నారు.