గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ లో వర్గ విభేదాలు బహిర్గతం అయ్యాయి. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను పార్టీ నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం భగ్గు మంది. ఎమ్మెల్యే శ్రీదేవి తన మద్దతు దారులతో జిల్లా పార్టీ సమన్వయ కర్త, మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఇంటి వద్ద శనివారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు.
డొక్కా ను నియోజక వర్గ పార్టీ బాధ్యతల నుండి తొలగించాలని ఎమ్మెల్యే శ్రీదేవి వర్గ నేతలు డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యే పై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొద్ది సేపు మేకతోటి సుచరిత ఇంటి ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం నేతలు.. ఆ తరువాత తమ ఆవేదన ను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు.
ఎమ్మెల్యే శ్రీదేవి కోసం అవసరం అయితే సర్పంచ్ లు, ఎంపిటిసి లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డొక్కా ను నియోజక వర్గ పార్టీ బాధ్యతల నుండి తొలగించి శ్రీదేవి నే కొనసాగించాలని కోరారు. కాగా 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ నుండి వైసీపీ లో చేరగా సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతకు ముందు డొక్కా 2004, 2009 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు.