రాష్ట్రం మొత్తం హిందూ విగ్రహాల గొడవలో మునిగింది. స్థానిక ఎన్నికల గొడవలో మునిగింది. టీడీపీ- వైసీపీ ఈ అంశాల మీద వాదులాడుకుంటున్నాయి. బీజేపీ సైలెంట్ గా తమ పని చేసుకుంటుంది. ఒకవైపు హిందూ దేవతా విగ్రహాల ధ్వంసంపై రాజకీయంగా వాడుకుంటూనే.. మరోవైపు టీడీపీకి దెబ్బ వేస్తూ అడుగులు వేస్తుంది..! ఇప్పటికే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో టీడీపీకి కనిపించని దెబ్బ వేసేసింది..!
సైలెంట్ గా నాయకులతో మంతనాలు..!!
బీజేపీ నాయకులు విజయనగరం జిల్లా రామతీర్ధం వెళ్లారు. అక్కడ గొడవ చేసారు. హిందూ సెంటిమెంట్ గొడవ జరుగుతుంది. టీడీపీ దీనిపై ఫోకస్ పెట్టింది. బీజేపీ దీనిపై ఫోకస్ పెడుతూనే.., అక్కడ టీడీపీ నాయకులను చేర్చుకోవడంపైనా దృష్టి కేంద్రీకరించింది. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుండి వరుసగా టీడీపీ నేతలు వచ్చి సోముతో కలుస్తున్నారు. కొందరు చేరికకు ఒకే అంటున్నారు.., కొందరు ఆలోచిస్తాం అంటున్నారు. మొత్తానికి బీజేపీతో కనెక్షన్ అయితే కుదుర్చుకుంటున్నారు. దీనిలో టీడీపీకి కీలకమైన నేతలు కూడా ఉన్నారు.
ఈ సామజిక వర్గాలు కీలకం..!!
ఉత్తరాంధ్ర రాజకీయం మొత్తం మూడు సామజిక వర్గాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తూర్పు కాపు.., కళింగ వైశ్య.., కొప్పుల వెలమ.., ఈ మూడు సామజిక వర్గాలే ఇక్కడ ఎక్కువగా శాసిస్తాయి. ఆ తర్వాత స్థానంలో కాపు, చేనేత, ఎస్సి వర్గాలు ఉంటాయి. టీడీపీకి ఈ సామజిక వర్గాల్లో బలమైన నాయకత్వం ఉంది. బీజేపీ ఈ వర్గాలపై దృష్టి పెట్టింది. కొందరు నేతలతో మంతనాలు జరుపుతూ ప్లాన్ అమలు చేస్తుంది.
* గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ తూర్పు కాపు నేత. ఆమె బీజేపీలో చేరిపోయారు. ఆమె ద్వారానే గద్దె బాబూరావుతో కూడా మంతనాలు జరపగా ఆయన కూడా కాషాయాల కళ్లద్దాలు పెట్టుకున్నారు.
* ఈ ఇద్దరి తర్వాత ఇప్పుడు బీజేపీ ఫోకస్ కళా వెంకట్రావు కుటుంబంపై పెట్టింది. కళా టీడీపీలో కొంచెం సైలెంట్ గా ఉంటున్నారు. అందుకే కళా తమ్ముడు రామకృష్ణం నాయుడు.. వారి కుమారుడు వినయ్ తో బీజేపీ మంతనాలు జరుపుతుంది. ఇప్పటికే వీళ్ళు సోము వీర్రాజుని కలిశారు. కళా కుటుంబం పెద్దది. మూడు నియోజకవర్గాల్లో పట్టు ఉంది. అందుకే వీరిపై బీజేపీ దృష్టి ఉంది. దాదాపు చేరిక ఖరారైనట్టే..!
* ఇక కాపు సామాజికార్గంలో కీలక నేత గంటా శ్రీనివాసరావుతో బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు. గంటా టీడీపీలో ప్రస్తుతం యాక్టీవ్ గా లేరు. వైసిపిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జగన్ అంగీకరించడం లేదు. అందుకే గంటాని తెలుగు దేశం పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గంటా ద్వారా మరో ముగ్గురు మాజీలు వస్తారని ఆశిస్తున్న బీజేపీ.. ఆయనకు స్వాగతం పలుకుతుంది. అయితే “బీజేపీతో వెళ్తే మళ్ళీ గెలవగలనా..? ఆ పార్టీకి ఓట్లు పడతాయా..? అనే సందేహంతో గంటా ఆలోచిస్తున్నారట. ఈయన వచ్చేస్తే కాపు సామాజికవర్గంలో కొంత పట్టు ఉంటుంది అనేది బీజేపీ లెక్క.
టీడీపీ పరిస్థితి ఏంటి..!?
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంత బాలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు (అచ్చెన్నాయుడు / బెందాళం అశోక్) ఉన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అశోక్ అంత యాక్టీవ్ గా లేరు. అచ్చెన్నాయుడు రాష్ట్రస్థాయిలో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు అప్పుడప్పుడూ మెరుస్తారు.
* విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు అశోక్ గజపతి రాజు కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అశోక్ గజపతిరాజు తొలిసారిగా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇకపై ఆయన పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోవచ్చు. పైగా ఆ జిల్లాలో గీత అశోక్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు.
* విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలు నలుగురిలో ఒకరు (గణేష్ కుమార్) వైసిపికి వెళ్లగా.. ఇంకొకరు (గంటా) గురించి పైన చెప్పుకున్నాం. ఇక మిగిలిన ఇద్దరిలో వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబులు టీడీపీని వీడే పరిస్థితి లేనప్పటికీ రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
* గీతం భారత్ యాక్టివ్ గా ఉండడం లేదు. అయ్యన్నపాత్రుడు ఒక్కరే ప్రస్తుతానికి జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ఆయన అడపాదడపా వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడుతూ టీడీపీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో… ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో టీడీపీ ఒకప్పటి వెలుగు అందుకోవాలంటే చాలా దశలు దాటాల్సి ఉంటుంది..!!