Lock Down ; దేశాన్ని కరోనా తాకి ఏడాది పూర్తయింది. అయినా అదే సీన్. అదే పరిస్థితి. అదే భయం. అవే అనుమానాలు, అదే ఆందోళన. గత ఏడాది మార్చి 22 న లాక్ డౌన్ విధించారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇటీవల మళ్ళీ కరోనా పెరుగుతుంది. కేసులు ఎక్కువయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్నారు. మరి లాక్ డౌన్ ఉంటుందా..!? ఆ అవకాశాలు ఉన్నాయా..!? దేశంలో పరిస్థితి ఏమిటి..? ఏ రాష్ట్రాల్లో ఎలా ఉంది అనే కీలక అంశాలను ఓ సారి పరిశీలిస్తే..!!
Lock Down ; నిరుడు వ్యాప్తి ఇలా.. లాక్ డౌన్ లేనప్పుడే..!?
గత ఏడాదిలో మే చివరి వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. దాదాపు రెండు నెలలు దేశానికి షట్టర్లు పడ్డాయి. మరో కీలక అంశం ఏమిటంటే… నిజానికి దేశంలో కరోనా మే ఆఖరు వరకు అదుపులో ఉన్నట్టే కనిపించింది. లాక్ డౌన్ ఎత్తేసాక… జనం స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టేసాక… జూన్ 2020 నుండి కరోనా విపరీతంగా వ్యాపించడం ఆరంభమయింది. మార్చి నుండి మే వరకు సగటున రోజుకి 1800 కేసులు నమోదవ్వగా… జూన్ నుండి ఆగష్టు వరకు రోజుకి సగటున 32 వేల కేసులు… ఆగష్టు చివరి నుండి అక్టోబర్ వరకు రోజుకి సగటున 70 వేల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 97894 కేసులు సెప్టెంబర్ 16 న నమోదయ్యాయి. నవంబరు, డిసెంబర్ లో కాస్త తగ్గాయి. జనవరి, ఫిబ్రవరి వచ్చే సరికి మళ్ళీ అదుపులో ఉన్నట్టే కనిపించింది. రోజుకి 11 వేల కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జూన్ నుండి చూసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి 8 న మాత్రమే దేశంలో తక్కువ (9110 ) కేసులు నమోదయ్యాయి. కానీ గత వారం నుండి మళ్ళీ పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఏ సమయంలో ఎటువంటి ఆందోళన మొదలయిందో.. ఇప్పుడు మళ్ళీ అదే రకమైన ఆందోలన మొదలయింది. దేశం గడిచిన అయిదు రోజుల్లో వరుసగా… మార్చి 18 న 39 వేలు, మార్చి 19 న 42 వేలు.., మార్చి 20 న 43 వేలు.., మార్చి 21 న 46 వేలు.., మార్చి 22 న 43 వేల కేసులు చొప్పున నమోదయ్యాయి. ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కూడా తాకిడి వచ్చింది.
కంచాలు చప్పుళ్ళు.. దీపాలు పని చేయవు..!! లాక్ డౌన్..!?
గత ఏడాది కరోనాపై అప్రమత్తత నేపథ్యంలో ప్రధాని మోడీ కొన్ని పబ్లిసిటీ స్టెంట్లు కూడా బాగానే చేయించారు. మార్చి 20 న కంచాలతో చప్పుళ్ళు.. ఏప్రిల్ 5 న లైట్లు ఆపేసి దీపాలు వెలిగించడం.. వంటి స్టెంట్లు చేయించి కరోనాపై ఒక అవగాహనా కల్పించే ప్రయత్నం చేసారు. అదుపు తప్పితే ఆ క్రెడిట్ తీసుకోవాలి అనుకున్నారు. కానీ కరోనా అదుపులో లేకపోవడంతో తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆ తాటాకు చప్పుళ్ళు, దీపాలు పని చేయవు. జనంలో కరొనపై ఒక అవగాహనా వచ్చేసింది. మరి ఈ ఏడాది లాక్ డౌన్ ఉంటుందా..!? ఉండదా అనే చర్చ అప్పుడే మొదలయింది.
* గత ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశం బాగా దెబ్బతినింది. దేశం మొత్తం మీద 12 వేల హోటళ్లు మొత్త పడ్డాయి. అన్ని రంగాల్లో కలిపి దాదాపు పదిహేను కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. దాదాపు రెండున్నర కోట్ల మంది ఆకలి చావులతో ఊపిరి వదిలారు. కరోనా నష్టాలు పేరిట వ్యాపారాలు మూత పడ్డాయి. యిప్పటికీ కొన్ని రంగాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మొత్తం మీద దేశము దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది.
జీడీపీలో ఇది 15 శాతం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కరోనా చివరి దశలో ఆర్హిక ప్రోత్సాహకాలు, ప్యాకేజీలు ప్రకటించి కాస్త ఉపశమనం ఇచ్చింది. రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా అతలాకుతలం అయ్యాయి.
* కరోనా కాలం, లాక్ డౌన్ నష్టాల నుండి దేశం మొత్తం మీద మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గడిచిన మూడు నెలల నుండి ఒక్కో దశ దాటుకుంటూ పూర్వస్థితికి చేరుకుంటున్నాయి. ఉత్పత్తులు, కొనుగోళ్లు, లావాదేవీలు కాస్త ఊపందుకున్నాయి. ఈ దశలో మళ్ళీ లాక్ డౌన్ అంటే..!? దేశం బాగా వెనకబడుతుంది. గత ఏడాది తగిలిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ తగిలేస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసులు గత ఏడాది జులై , ఆగష్టు, సెప్టెంబర్ లో వచ్చిన కంటే ఎక్కువ కాదు. అప్పుడు లాక్ డౌన్ లేకుండానే పెరిగాయి. సో.. లాక్ డౌన్ విధించడానికి కరోనా కొత్త వైరస్ కాదు, కోవిడ్ 19 కి ఎక్కడా వణకడం లేదు.., అప్పులకు, ఆర్ధిక ప్యాకేజీలకు నిధులు లేవు. కరోనా కేసులు రోజుకి 60 వేలు మించితే మాత్రం దేశం మొత్తం మీద కాస్త జన సంచారం అదుపు చేయడానికి కొన్ని నిర్ణయాలు తప్పకపోవచ్చు.. అంతే కానీ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టె అవకాశాలే లేనట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్ళీ అదే విధంగా రెండు నెలలు లాక్ డౌన్ పెడితే మాత్రం పేదరికం 12 శాతం పెరుగుతుందని.., మరో 2 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని.., దేశ ఆర్థికరంగం 1990 ల కాలానికి చేరుతుందని పేర్కొంటున్నారు..!!