రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. ఈ ఏడాది అంటే శార్వరీ నామ సంవత్సరంలో ఆగస్టు 3న రాఖీ పండుగ వస్తుంది. శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటారు. ఈ రోజు అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ”రాఖీ” కట్టి,”పది కాలాలపాటు చల్లగా ఉండాలని” మనసారా కోరుకుంటుంది.
0
తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. అసలు రాఖీ సంప్రదాయం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలీదు, కానీ ఈ ఆచారం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రక్షాబంధనం గురించి ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు తెలుసుకుందాం…
రాఖీ పౌర్ణమిని ”బలేవా” అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెల పోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి, రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి, భ్రాతృ ప్రేమతో ”ఏం కావాలమ్మా” అని అభిమానంగా అడిగాడు. లక్ష్మి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు ఆర్ద్రమైంది. సర్వం త్యాగం చేసి, లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసికెళ్ళమన్నాడు.
మహాభారతం ప్రకారం ద్రౌపదికి, వస్త్రాపహరణం సమయంలో, మహా రాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపద రాజు కానీ, ఉద్దండులయిన ఐదుగురు భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని ప్రార్ధించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి, అవమానం నుండి తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచిస్తుంది.
రాణీ కథ !
మరో రాణి కథ
తెలుసుకుందా… 1535లో రాణీ కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహద్దూర్ షా, చిత్తూరుపై కన్నేశాడు. ఏ క్షణాన అయినా సుల్తాన్ దండెత్తిరావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణీ కర్ణావతి భయపడింది. బాగా ఆలోచించి, తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తే అని నమ్మింది. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మానసును గెలిచింది.
కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోతపై దాడి చేశాడు. హుమాయూన్ కు విషయం అర్ధం అయ్యేసరికి పరిస్థితి విషమించింది. రాణీ కర్ణావతితో సహా 13 వేలమంది స్త్రీలను సుల్తాన్ చేర పట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి, గుజరాత్ సుల్తాన్ను ఓడించి, చిత్తూరు రాజ్యాన్ని రాణీ కర్ణావతి కొడుక్కు ఇప్పించాడు. హుమాయూన్ కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలిపోయింది.
శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. సోదరులు దూరప్రాంతాల్లో ఉంటే, రాఖీలను పోస్టులో పంపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది మరి. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకూ పాకింది.
అలాగే, సొంతవారికే కాకుండా, తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికీ కడుతున్నారు. చుట్టరికంలోనే గాక, బంధుమిత్రుల పిల్లలు, పక్కింటివారు, స్నేహితులు ఇలా ఎవరికైనా రాఖీ కడుతున్నారు. కాలేజీల్లో తమ వెంటబడి పోకిరీ వేషాలు వేసే అబ్బాయిల్ని రాఖీతో వదిలించుకునే అమ్మాయిలకీ లోటు లేదు. ఇలా అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా ఒక సదుద్దేశంతో ఏర్పర్చిన పండుగ. ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ. కోట్లాదిమందికి ఉపాధి చూపించే పండుగ.