సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, ఋజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థంకాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యే లా చెప్పారు. రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు.
భగవంతుడు అంతటా, అందరి లోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు, ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం అశాశ్వతమని, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తాను నివాసముండే మసీదుకు బాబా, ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు. సాధన లో గురువు ప్రాముఖ్యత ను గురించి, గురువు నే దేవుడి గా భావించమనీ పదేపదే చెప్పారు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు.
సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్ , అహమ్మద్ నగర్కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు. శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు. వారిలో ముఖ్యులు: మహాల్సాపతి , హేమాండ్ పంతు, శ్యామా, దాసగణు, హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్), రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాఠే, నానా సాహెబ్ చందోర్కర్, బల్వంత్ నాచ్నే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, ఖాపర్దే, కర్టిస్, రావు బహద్దూర్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపీ, కొండాజీ,గాబాజీ,తుకారాం , శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కాడ్, రేగే, రాధాకృష్ణ ఆయీ, కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించిణీకర్, చక్ర నారాయణ్, జనార్ధన్ గల్వంకర్ మొదలైనవారు ఉండేవారు.