ప్రకృతి అందాలకు నెలవైన గోవాపట్టణం పేరు చెప్పగానే విశృంఖలమైన ఆటవిడుపు స్థలం, అవైదిక అధార్మిక సనాతనధర్మ వ్యతిరేక ప్రదేశంగా భావిస్తారు. కానీ నిజానికి ఇది పూర్వ నుంచి ఒక పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశం. మద్యం, జూదం, ఇతర కార్యకలాపాలకి పెట్టింది పేరుగా ప్రస్తుతం ముద్రపడ్డది. ఇది కేవలం పాశ్చాత్యులు ఆ ప్రాంతంలోకి వలసవచ్చిన తర్వాత దీని పరిస్థితి మారిపోయింది. కానీ ఎన్ని దాడులు జరిగినా ఇక్కడ ఇప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు, చుట్టుపక్కల పల్లెల్లో మన నాగరికత పరిఢమిల్లుతూనే ఉంది. ఆదిశంకరుల గురువర్యులు శ్రీ గౌడపాదుల వారి మఠం ఇక్కడే ఉంది.
కొంకణ పర్వత సాణువుల్లో మాండవి నదీ సంగమ తీరంలో ఉన్న ఈ సముద్ర తీరం అంతా ’ప్రకృతి రూపంలో పార్వతి మాత పరవశమే’. ఎంతో దైవీ వృక్ష సంపద, రావి, మర్రి, మద్ది, కొబ్బరి, పనస, మామిడి, బొగడ, వెలగ, మారేడు, పోక, సంపెంగ, మందార ఎన్నో ఎన్నో దేవతా వృక్షాలు. మల్లి, లవంగ, మిరియాలతీగలు, సుగంధ ద్రవ్యాల చెట్లు, పొదలు. ఈ ప్రాంతంలో అమ్మవారి ఆరాధన ఎక్కవు అమ్మవారిని సంతేరి అని పిలుస్తారు. ఇక్కడ పురోహిత వృత్తిలో ఉండేది కొంకణ సారస్వతులు. దక్షిణ కర్ణాటక పద్ధతులే కనిపిస్తాయి ఎక్కువగా. సరే వాడుక భాషలో సంతేరి అన్నా అమ్మవారి పేరు ’శాంత దుర్గ’ శాంత దుర్గ సంస్థానములు అని గోవాలో 5-6 చోట్ల ఆలయాలుంటాయి. దక్షిణగోవాలో మంగేశ్వర్, శాంత దుర్గ, గణపతి, మహాలస, బాలాజీ ఆలయాలు ముఖ్యంగా దర్శనీయాలు.
మంగేష్వర్, మంగేషి మంగిరీశ్వర్ అనే పేర్లతో పిలువబడే ఆలయం శివసంబంధమైనది. అమ్మవారు ఈ పర్వత సానువుల్లో తపస్సు చేస్తుండగా శివుడు పరీక్షించడానికి ఒక పులిని పంపాడట. మామూలు పులి ఐతే అమ్మవారికి లొంగిపోయేది. కానీ, పరీక్షించడానికి శివుడే ఆ రూపంలో రావడంతో ఆమె భక్తి సడలించక సర్వశరణాగతి చేసి ’త్రాహి మాం గిరీశ్వరా’ అని వేడుకొందట. శివుడు పులి వేషం వదిలి ప్రసన్నుడై ప్రత్యక్షమైయాడని స్థల ఐతిహ్యం. అప్పట్నుంచి ఆ ప్రదేశంలోకి వచ్చి అందరు భక్తులూ పులికన్నా ప్రమాదమైన ఈ సంసారం నుంచి కాపాడమని ’త్రా హి మాం గిరీశ్వరా’ అని వేడుకోవడం మొదలెట్టారు. కాల క్రమంలో మాంగిరీశ్వర్, , మాంగిరీషి గా మారి ఇప్పుడు ’మంగేషి’ గా పిలువబడుతున్నది. మంగేష్కర్ ఇంటి పేరు కలవారు ఈ గ్రామానికి చెందినవారే అంటారు. పుష్కరిణి కూడా గొప్పగా ఉన్నది..
మహాలస : ఇక్కడ మహావిష్ణువు ఏకబేర మూర్తిగా ఉంటారు లక్ష్మీనారాయణస్వామిగా పక్కనే సంతేరి అమ్మవారు ఉంటారు (పార్వతి / శాంత దుర్గ). నారాయణ నారాయణి కలిసి ఉన్న ఆలయం బహుశః ఇదేనేమో… నారాయణుని స్త్రీరూపమే పార్వతి అని తెలియజెప్పేదే ఈ ఆలయం. ఈ ఇద్దరి కలయికే ఈ ఆలయం. గణపతి ఆలయం : పై ఆలయాలకన్నా చిన్నది కానీ చుట్టూ ఉద్యానవనంతో అలరారుతోంది. శాంత దుర్గ : శాంత చండి – సంతేరి. ఆలయం మంగేషి అంత పెద్దది. ఆలయ ప్రాకారం దాటి లోపలకి వెళ్ళగానే మట్టి కనపడదు మట్టి ఉండే స్థలం అంతా గోమయంతో అలికి ఉంది. అద్భుతంగా తోచింది. మేం వెళ్ళినప్పుడు పక్కనే ఏదో యాగం చేస్తున్నట్టున్నారు. సరే అమ్మవారు ఒకసారి హరిహరులమధ్య ఎందుకో వాదు వస్తే మధ్యవర్తిగా ఉండి ఇద్దరినీ శాంతింపజేసిందని ఐతిహ్యం.
ఆమె దుర్గయే ఐనా అతి శాంత మూర్తి. పక్కన మూడు మహా సర్పాలుంటాయి అవి హరిహరబ్రహ్మలకు వారి మధ్య వైరానికి చిహ్నములటఅమ్మవారికి మామూలు లౌకిక హారతి మొదట ఇవ్వరు ఆలయం బయట ఎక్కడో దీప స్తంభమంటపాలదగ్గర ఒక అద్దం అమర్చి సూర్య కిరణాలు పరావర్తనం చేయించి ఆ కిరణాలు అమ్మవారి మీద పడేలా చేసి ముందు హారతి సూర్య కిరణాలతో ఇస్తారు. ఆ హారతి వెలుగులలోనే ఇక మిగిలిన అన్ని నక్షత్ర, కుంభ, సప్త, పంచ, ఏక, కర్పూర అన్ని హారతులూ ఇస్తారు. ఇదంతా దాదాపు 15 నిమిషాలకు పైగా సాగుతుంది. ఆ సూర్య కాంతి వెలుగులోఅమ్మవారు ఎవరికి వారికి అతి దగ్గరగా ఉన్నట్లు దర్శనమిస్తుంది.