కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఫైర్బ్రాండ్ నేతగా ముద్రపడిన ఆయన గత కొద్దికాలంగా అనుసరిస్తున్న వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుపై గత కొద్దికాలంగా సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న జగ్గారెడ్డి ఇటీవల కాంగ్రెస్ నేతల గురించి సైతం అదే రీతిలో తన మార్కు కామెంట్లతో టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అంతర్గత పరిణామాల గురించి జగ్గారెడ్డి స్పందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మరో నేతకు ఆ పగ్గాలు అప్పగించనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారని వార్తలు వస్తుండటాన్ని ఖరారు చేసేసిన జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలని ఢిల్లీ అధిష్టానం ఆలోచిస్తోందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని పేర్కొంటూ ఆ పదవికి పోటీపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఝలక్ ఇచ్చారు.
ఎప్పుడు అధ్యక్షుడిని మార్చలనుకున్నా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ముఖ్య నేతలైన సోనియా, రాహుల్ గాంధీని కోరుతూనే ఉన్నానని మరింత ఆసక్తిని రేకెత్తించారు. తనకు ఆ పదవి ఇస్తే సీనియర్ల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని కూడా ముందుగానే తన ప్రణాళికను వెల్లడించారు. ఢిల్లీలో టీపీసీసీ మార్పుపై చర్చ జరుగుతున్న తరుణంలో జగ్గారెడ్డి చేసిన ఈ కామెంట్లు సహజంగానే కాంగ్రెస్ నేతల దృష్టిని ఆకర్షించేవే. కాగా, గత కొద్దికాలంగా మంత్రి హరీశ్రావుపై జగ్గారెడ్డి విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అనంతరం దానికి క్లారిటీ కూడా ఇచ్చారు.
హరీశ్ రావు మంత్రిగా చేసిన తప్పులనే తాను ఎత్తి చూపుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. “సంగారెడ్డి మెడికల్ కాలేజ్, మంజీరా నీటి తరలింపుపైనే హరీశ్ రావుపై విమర్శలు చేశాను. దానికి కేసీఆర్కు కేటీఆర్ కు సంబంధం లేదు. “ అని చెప్పుకొచ్చారు. మరో సందర్భంలో సీఎం కేసీఆర్, హరీష్ రావు పైన పాస్ పోర్ట్ కేసులు ఉన్నాయని తెలిపిన జగ్గారెడ్డి వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.