Sharwanand: టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 హీరోల్లో శర్వానంద్ ఒకడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శర్వానంద్.. ఆ తర్వాత హీరోగా నిలుదొక్కుకున్నాడు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, శతమానంభవతి వంటి చిత్రాలతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఓవైపు యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం చేరువయ్యాడు. సాఫ్ట్ కథలకే కాకుండా యాక్షన్ చిత్రాలకు కూడా చక్కగా యాప్ట్ అయ్యే శర్వానంద్.. ఈ శుక్రవారం `మనమే` మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.
శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించగా.. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జూన్ 7వ తేదీన మనమే మూవీ వరల్డ్ కప్ రిలీజ్ కాబోతోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, సినీ నిర్మాత విశ్వప్రసాద్.. శర్వానంద్ కు ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు. సాధారణంగా ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలకు మాత్రమే పేరు ముందు ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఉండేది. కానీ ఇటీవల దాదాపు ప్రతి హీరోకు ఏదో ఒక టాగ్ వేస్తున్నారు. కానీ ఇంతవరకు శర్వానంద్ కు ఎటువంటి ట్యాగ్ లేదు.
అయితే మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ కు నిర్మాత విశ్వప్రసాద్ `ఛార్మింగ్ స్టార్` అంటూ ట్యాగ్ ఇచ్చారు. శర్వానంద్ పేరుకు ముందు ఛార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ ను యాడ్ చేసి స్క్రీన్ పై ప్లే చేశారు. ఇకపై శర్వానంద్ నటించిన ప్రతి సినిమాలో ఆయన పేరుకు ముందు ఈ ట్యాగ్ పడనుందని విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై శర్వానంద్ స్పందిస్తూ.. `డైరెక్టర్ మారుతి మహానుభావుడు సినిమా టైమ్లో ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని చాలా పేర్లు వినిపించారు. నేను వద్దన్నాను కానీ ఇప్పుడు మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. థాంక్యూ సార్` అంటూ చెప్పుకోచ్చాడు. ఇక ఛార్మింగ్ స్టార్ ట్యాగ్ అదిరిపోయింది అంటూ శర్వానంద్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా హీరోకి సరిపడే ట్యాగ్ ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.