మానవత్వమా సిగ్గుపడు..! మనిషి తత్వమా బాధపడు..!! ఆధునిక వైద్యమా బాగుపడు …! ఎదుగుతున్న భారతమా ఎగిరిపడు…! కరోనా కాఠిన్యమా సంబరపడు…! గుండె గట్టిది చేసుకుని ఈ వార్త చదవండి..!
ఏమిటీ దారుణం..! ఆ పసి గుడ్డుకేం తెలుసు కరోనా కాటు వేస్తుందని.., ఆ తల్లికేం తెలుసు కరోనా సోకుతుందని.., ఆ కరోనాకే అన్నీ తెలుసు. వచ్చింది, వస్తూనే ఉంది, భయపెడుతుంది, చంపుతుంది, చంపి చంపి ఇలా ఏడిపిస్తుంది…!
“ఓ తల్లి కాబోతున్న మహిళ. నవ మాసాలు మోయడం పూర్తయ్యింది. మరో వారంలో డెలివెరి. ఇక ఆ ఇంట్లో బోసి నవ్వులు రాబోతున్న సమయం. కుటుంబమంతా ఎదురు చూస్తుంది. కానీ ఇది కరోనా సమయం కదా. అది వచ్చింది. ఆ మహమ్మారి ఆ కుటుంబానికి సోకింది. ఆ తల్లికి సోకింది. ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన 23 ఏళ్ళ నిండు గర్భిణీ ఆమె. ఇక ఒంగోలులోని ఆసుపత్రిలో చేరింది. నాలుగు రోజుల నుండి చికిత్స తీసుకుంటుంది. ఈ లోగా దగ్గు ఎక్కువవ్వడం, ఊపిరి కష్టంగా మారడంతో లోపలున్న పసి బిడ్డ కన్ను మూసింది. ఆ తల్లి తల్లడిల్లుతుండగా, బిడ్డ శ్వాస ఆగిపోయింది. ఇక్కడితో బాధ ఆగలేదు.
కరోనా సోకినా ఆ బిడ్డని బయటకు తీయడానికి వైద్యులు చాల సేపు నిరాకరించారు. భయపడ్డారు. బాధ పడుతూనే, సానుభూతి చూపుతూనే భయపడ్డారు. దాదాపు తొమ్మిది గంటల యాతన తర్వాత ముగ్గురు వైద్యుల బృందం కలిసి సాయంత్రం ఆ తల్లి, బిడ్డని వేరు చేసారు. ఓ వైపు కరోనా.., మరోవైపు బిడ్డ మరణం.., ఇంకోవైపు గర్భంలోనే చాల సమయం మృత శిశువు… ఇలా అన్ని విధాలుగా ఆ తల్లి నరకాన్ని చవిచూసింది.