పాపం చైనా స్మార్ట్ రంగం..! ఒక్కరోజులో అల్లకల్లోలానికి గురయ్యింది. అనుకోకుండా ఇండియా నుండి వచ్చిన “యాపారా” దెబ్బని తట్టుకునేందుకు కొత్త దారులు వెతుక్కుంటుంది. చైనాకి దెబ్బకొట్టే క్రమంలో ఆ దేశం నుండి తయారై వచ్చిన 59 యాప్స్ ని ఇండియా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని పర్యవసానాలు భలే ఆసక్తిగా ఉన్నాయి. టిక్ టాక్ అయితే ఈ నష్టం నుండి కోలుకునే క్రమంలో అప్పుడే బోర్డు మీటింగ్ పెట్టుకుని, భర్తీ చర్యలు చేపట్టింది.
రోజులో ఎంత నష్టమంటే..!!
టిక్ టాక్ మొత్తం యూజర్లలో ఇండియాలోనే దాదాపు 22 శాతం ఉంటారు. ఇటీవల లెక్క ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మంది ఉన్నారు. నిన్నటితో ఈ 60 కోట్ల మంది టిక్ టాక్ వాడడం మానేసినట్టే. అందుకే ఉన్నపళంగా టిక్ టాక్ యూజర్లు తగ్గడంతో ఆదాయం కూడా భారీగా తగ్గింది. నిన్న ఒక్కరోజునే ఈ సంస్థకి రూ. 5 లక్షల డాలర్లు అంటే సుమారుగా… 375 లక్షలు నష్టం వచ్చింది. ఇదే కొనసాగితే ఈ నష్టం మరింతగా పెరుగుతుంది. ఆ సంస్థ రోజువారీ ఆదాయంలో దాదాపు 20 శాతం మన దేశం నుండి ఉండడంతో ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో ఆ యాప్ యాజమాన్యం ఉందట. దీని నుండి కోలుకోడానికి పబ్లిక్ ఇష్యూ కి వెళ్లేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
భారత్ లో విస్తరించాలి అనుకుని దెబ్బతిన్నాయి…!
టిక్ టాక్ సహా… యుసి బ్రౌజర్, షేర్ ఇట్, లైకి, హలో యాప్ లు కూడా ఇండియాలో బాగా ప్రజాదరణ పొందాయి. ఈ 59 యాప్ లను దాదాపుగా 60 కోట్ల మంది వాడుతున్నారు. ఒక్కసారిగా ఇన్ని కోట్ల సంఖ్యలో వినియోగదారులు తగ్గాడా ఆయా సంస్థలకు దెబ్బ కొట్టినట్టే. నిజానికి మూడు నెలల కిందట మార్చిలో జరిగిన వార్షిక సమావేశాల్లో టిక్ టాక్, షేర్ ఇట్, లైకి వంటి సంస్థలు ఇండియాలో మరింతగా ఆపెట్టుబడులు పెట్టి.. మార్కెట్ ని పెంచుకోవాలని చూశాయి. కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల నుండి కార్యకలాపాలు మొదలయ్యేలా ప్రణాళికలు వేసుకున్నాయి. ఈ తరుణంలో యాప్ లు నిషేధించడం వాటికి తేరుకోలేని దెబ్బ పడినట్టే.