దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ గత ఏడాది తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈ దాడులు చేపట్టింది. నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చిన సమయంలో సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న అరవ గోపీకృష్ణ ఇంటిలోనూ సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సీబీఐ దాడుల విషయాన్ని సిసోడియా ట్విట్టర్ వేదికగా దృవీకరించారు. సీబీఐ అధికారులు తన నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు ఏజన్సీకి తాను సహకరిస్తున్నాను, తనకు వ్యతిరేకంగా ఏమీ సీబీఐకి లభించలేదని పేర్కొన్నారు. ఆరోగ్యం మరియు విద్య రంగంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కేంద్రం ఆందోళన చెందుతోందని ఆరోపించారు. అందుకే రెండు శాఖల మంత్రులను లక్ష్యంగా చేసుకున్నారని సిసోడియా అన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను మే నెలలో అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము చేస్తున్న మంచి పనులకు కేంద్రం ఇస్తున్న బహుమానం ఇదేనంటూ సెటైర్ వేశారు. ఈ రోజే ఢిల్లీలో విద్యారంగం అభివృద్ధిని అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో మనీశ్ సిసోడియా ఫోటోతో కథనం వచ్చిందని తెలిపారు. ఇదే రోజున ఆయన నివాసంలో సీబీఐ సోదాలు చేస్తొందని మండిపడ్డారు. మంచి పనికి లభిస్తున్న ఫలితం ఇది అని ఆయన అన్నారు. సీబీఐకి స్వాగతం పలుకుతున్నామనీ, దర్యాప్తు సంస్థకు సహకరిస్తామన్నారు. గతంలోనూ మా నేతలపై దాడులు జరిగినా అప్పుడు వారికి ఏమీ లభించలేదనీ, ఇప్పుడు కూడా అంతేనని చెప్పారు.
ఢిల్లీ ఆప్ సర్కార్ తీసుకువచ్చిన నూతన మధ్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి గతంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిఫార్సు చేసిన నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా నేడు తనిఖీలు చేపట్టింది.