Delhi excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కీలక అడుగు వేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అనేక ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఈ కేసులో విజయ్ నాయర్, తెలంగాణ (హైదరాబాద్) కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసింది. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ రెండు పర్యాయాలు సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతల బంధువులు. అనుచరులను సీబీఐ విచారించింది.
కాగా సీబీఐ అధికారులు సమన్లు జారీ చేయడంపై డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన నివాసంలో 14 గంటల పాటు సీబీఐ సోదాలు నిర్వహించినా ఏమీ దొరకలేదు. బ్యాంకు లాకరును తనిఖీ చేశారు అందులోనూ ఏమి కనిపించలేదన్నారు. తన గ్రామంలోనూ సోదాలు జరిపారనీ అక్కడా ఏ ఆధారాలూ లభించలేదని పేర్కొన్నారు. తనకు ఫోన్ చేసి సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి విచారణ కొరకు రావాలని కోరారనీ, తాను విచారణకు హజరై పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఢిల్లీలో గత ఏడాది నవంబర్ లో కేజీవాల్ సర్కార్ నూతన ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఈ నూతన మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దాన్ని విరమించుకుంది. ఇదే క్రమంలో మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలు ఉన్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా కు నివేదిక ఇచ్చారు. దీనిపై ఎల్జీ సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశారు. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తొంది.