Tamil nadu : ఏఐడీఎంకే నేత, ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే ఎంపి రాజా చేసిన వ్యాఖ్యల దుమారం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఏఐడీఎంకే నేతలు రాజా చేసిన వ్యాఖ్యలపై ఇసీకి ఫిర్యాదు చేయడం, ఇసీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంపి రాజాపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. డీఎంకే ఎంపి రాజా వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో డీఎంకే నేత స్టాలిన్ తమ పార్టీ నేతలు ఎన్నికల ప్రచార సభల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ సూచించారు. రాజా చేసిన వ్యాఖ్యలపై పళనిస్వామి తన దైన శైలిలో స్పందించారు. రాజా వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనను కల్గించాయని కంట తడిపెట్టారు.. వారికి భగవంతుడే శిక్షను విధిస్తారని అన్నారు. కాగా పళనిస్వామికి ఎంపి రాజా క్షమాపణలు తెలిపారు.
పళని స్వామి కంట తడి పెట్టడం తనను బాధించిందని రాజా వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా పళనిస్వామిని దూషించాలనే ఉద్దేశం తనకు లేదనీ, స్టాలిన్, పళనిస్వామి రాజకీయ జీవితాలను పోలుస్తూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రాజా పేర్కొన్నారు. పళనిస్వామికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తమిళనాట ఎన్నికల వేళ దగ్గర పడుతున్న నేపథ్యంలో డీఎంకె, ఏఐడిఎంకే మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. నువ్వానేనా అన్న రీతిలో డీఎంకే, ఏఐడీఎంకే ప్రచార పర్వం కొనసాగుతోంది. ఏఐడిఎంకే పొత్తుతో బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు పావులు కదుపుతోంది.