కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభన నేపథ్యంలో యూకే నుండి విమాన సర్వీసులను పలు దేశాలు నిషేదించిన సంగతి తెలిసిందే. భారత్ కూడా యూకే నుండి విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసింది. తొలుత గత నెల 31వ తేదీ వరకూ విమానాల రాకపోకలను నిషేదించిన భారత్..మరల ఈ నెల 7వ తేదీ వరకూ నిషేదాన్ని పొడిగించింది. ఈ నేపథ్యంలో యూకే విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 8వ తేదీ నుండి యుకేకి, ఇండియాల మధ్య విమాన రాకపోకలను పునః రుద్దరించన్నారు. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
అయితే ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు. హైదరాబాద్ విమానాశ్రయాల నుండి మాత్రమే విమాన రాకపోకలు ఉంటాయని తెలిపారు. జనవరి 23వ తేదీ వరకూ వారానికి 15 విమానాలు మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
మరో పక్క యూకేలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. కరోనా కేసుల తీవ్రత ఆధారంగా ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించారు. టైర్ 4 ప్రాంతాల్లో ఉన్న వారు అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రాకూడదని తెలిపారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుండి నిత్యావసర వస్తువుల షాపులు మినహా మార్కెట్ లు అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. టైర్ 4 లో ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు ఏప్రిల్ వరకూ కొనసాగుతాయి. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే దేశ మంతటా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. బుధవారం 50వేల కేసులు నమోదు కాగా గురువారం 55వేల కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు 2వేల మంది మరణించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ లో రెండు కోట్ల మంది వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. సెకండరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులను మరో 15 రోజులు పొడిగించారు. కొత్తరకం వైరస్ భయంతో యూకే నుండి విమాన రాకపోకలపై 40 దేశాలు నిషేదం కొనసాగిస్తున్నాయి.