పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొద్ది గంటల వ్యవధిలోనే కాషాయం కండువా కప్పేసుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో మన్ ప్రీత్ సింగ్ బాదల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తొలుత మన్ ప్రీత్ సింగ్ బాదల్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన రాజీనామా లేఖలో పార్టీ లో కానీ, ప్రభుత్వంలో కానీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. తమకు అవకాశాలు కల్పించడంతో పాటు తనపై చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేశారు బాదల్. పార్టీలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నిండి ఉందని పేర్కొన్నారు. పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో పార్టీ వర్గాలతో నిండిపోయిందని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను పని చేయలేననీ ఆయన స్పష్టం చేశారు. మరో పక్క మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలన పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశం ఎంతో బలంగా తయారు అయ్యిందని అన్నారు. పంజాబ్ లోని సవాళ్లను బీజేపీ మాత్రమే ఎదుర్కొగలదన్న ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ బాదల్ బీజేపీలో చేరిన ఈ రోజు తమకు సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. బాదల్ చేరికతో సిక్కులతో తమ బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ పక్క పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ బలోపేతానికి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న తరుణం, మరో పక్క పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే భాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలోనే పంజాబ్ కు చెందిన సీనియర్ నేత మన్ ప్రీత్ సింగ్ బాదల్ పార్టీని వీడి బీజేపీలో చేరడం పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లు అయ్యింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు, సీఎంగా చేసిన కెప్టెన్ అమరీందర్ సింద్ ఎన్నికలకు ముందు పార్టీని వీడటం తదితర కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఆప్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.