Remdesivir: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న వేళ కరోనా చికిత్సలో దివ్య ఔషదంగా భావిస్తున్న రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు సాగుతున్నాయి. తమిళనాడులో ఇంజక్షన్ లభించే కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కోవిడ్ బాధిత బంధువులు బారులు తీరుతూ కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పోరేషన్ ద్వారా ఈ ఇంజక్షన్ లను అందిస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం చెన్నై, కోయంబత్తూరు, సాలెం, తిరుచిరాయ్ పల్లి, మధురై, తిరునల్వేల్లి వంటి నగరాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా నేరుగా విక్రయాలు చేస్తున్నారు. ఈ కేంద్రాల వద్ద నిత్యం భారీ రద్దీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ లను ఇకపై నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకే విక్రయిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రేపటి (18వ తేదీ) నుండి ప్రత్యేక వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లకై బాధితుల ఇక్కట్లు తదితర విషయాలపై సమీక్ష జరిపిన సీఎం స్టాలిన్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్డెసివిర్ ఇంజక్షన్ లను సిఫార్సు చేస్తుండటంతో ఇవి విక్రయించే కేంద్రాల వద్ద బాధితుల బంధువులు వందల సంఖ్యలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొందరు వీటిని బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే నేరుగా ఈ ఇంజక్షన్ లను ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తామని తెలిపింది. ఆసుపత్రులు తమకు అవసరమైన ఇంజక్షన్ లను ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేసుకుని సంబంధిత ఆసుపత్రికి చెందిన వ్యక్తులే విక్రయ కేంద్రం నుండి తీసుకోవాలని తెలిపింది. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరకే రోగులకు ఇచ్చే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో బాధితుల బంధువులు రెమిడెసివిర్ ఇంజక్షన్ ల కోసం గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన బాధ తప్పుతుంది.