తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తుంటే మరి కొన్ని ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తుంటారు. బాణా సంచా తయారీ ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా తమిళనాడులో నిర్వహిస్తుంటారు. అయితే బాణాసంచా తయారీ కేంద్రాల్లో సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల గతంలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా ఇవేళ బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహరా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
కృష్ణగిరి పట్టణంం పాత పేటట ప్రాంతంలో బాణాసంచా భద్రపరిచిన గోడౌన్ లో పేలుడు సంభవించింది. ఈ గోడౌన్ నివాస సముదాయాల మధ్య ఉండటం వల్ల పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. ఈ భారీ పేలుడు వల్ల కొందరు 200 మీటర్ల దూరంలో పడిపోయారు. మరో పక్క శిధిలాల కింద మరి కొందరు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించి వెంటనే మంటలు చెలరేగాయిని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లోనే ఈ ప్రాంతం అంతా మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తొంది. గాయపడిన వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రవి (45), అతని భార్య జయశ్రీ (40), రితిక (17), రితీశ్ (15), ఇబ్రా (22), సిమ్రాన్ (20), సరసు (50), రాజేశ్వరి (50) మృతి చెందారని పోలీసులు తెలిపారు.
గ్యాస్ సిలెండర్ లీకేజీ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణ లో తేలింది. కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు, ఎస్పీ సరోజ్ కుమార్ టాగూర్, కృష్ణగిరి ఎమ్మెల్యే అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.