UP Elections 2022: భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చివరి దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. అధికారం ఎవరిదో తేల్చబోయే చిట్టచివరి దశ పోలింగ్ కావడంతో సర్వత్రా ఉత్కంట నెలకొంది. పూర్వాంచల్ లో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ సాగుతోంది. అజంగఢ్, మీర్జాపూర్, మౌవ్, జాన్ పూర్, ఘాజీపూర్, చన్ దౌలీ, భదోహీ, సోన్ భద్ర జిల్లాల్లో 54 అసెంబ్లీ సిగ్మెంట్లలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. “చివరి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పాల్గొని కొత్త ఓటింగ్ రికార్డు సృష్టించాలని ఓటర్లందరినీ అభ్యర్ధిస్తున్నాను” అంటూ ప్రధాన మంత్రి మోడీ ఉదయం ట్వీట్ చేశారు.
UP Elections 2022: సాయంత్రం 6 గంటల వరకూ
ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చివరి దశ పోలింగ్ సందర్భంగా 60వేల మంది పోలీసులు, 845 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా పూర్వాంచల్ లో భాగమే కావడంతో బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా విస్తృతంగానే ప్రచారం చేశారు. మూడు రోజుల పాటు వారణాసిలోనే ఉండి మేథావులు, ప్రముఖులతో చర్చించారు. రోడ్ షోలలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు మోడీ. యూపిలో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ ప్రధాని మోడీ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
దేశ రాజకీయాలను శాసించే ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు గెలిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లవచ్చన్నది బీజేపీ యోచిస్తోంది. మరో పక్క ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా క్షణం వృధా చేయకుండా ప్రచారం చేశారు. అఖిలేశ్ కు మద్దతుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రచారం చేశారు. ఈ సారి ఎలాగైనా అధికారం సాధించాలనే పట్టుదలతో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యూహత్మకంగా పలు చిన్న చిన్న పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రేస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటింగ్ శాతం పెంచుకోవడమే కాకుండా గతంలో కంటే అధిక స్థానాలు గెల్చుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.