దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపి సీజెగా అరూప్ కుమార్ గోస్వామి, తెలంగాణ సీజెగా జస్టిస్ హిమా కోహ్లీ, ఉత్తరాఖండ్ సీజెగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జమ్ముకశ్మీర్ సీజెగా పంకజ్ మిట్టల్, మద్యప్రదేశ్ సీజెగా మహమ్మద్ రఫీక్, అలహాబాద్ సీజెగా సంజయ్ యాదవ్, కర్నాటక సీజెగా సతీష్ చంద్ర శర్మ, కోల్కత్తా సీజెగా రాకేష్ బిందాల్, సిక్కిం సీజెగా జేకే మహేశ్వరి, ఒడిషా సీజెగా మురళీధరన్లు బదిలీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి సుప్రీం కోలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదంతో ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జార్హాట్ లో జన్మించారు. గౌహతి యూనివర్శిటీ పరిదిలోని కాటన్ కాలేజీలో నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే ఏడాది ఆగస్టు 16న ఈశాన్య రాష్ట్రాల బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, సర్వీస్ కు సంబంధించిన కేసులలో వాదనలు వినిపించారు. 2004 డిసెంబర్ 21న గువాహటి హైకోర్టు లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అక్కడే స్టాండింగ్ కౌన్సిల్ గా పని చేశారు. అసోం విద్యాశాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గానూ బాధ్యతలు నిర్వహించారు. 2011 జనవరి 24న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 నవంబర్ 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ గోస్వామి రెండు విడతల్లో కొంత కాలం గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2019 అక్టోబర్ 15 నుండి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.