కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక పరీక్షలు చేస్తూ రికార్డు సృష్టించింది. రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే సాధించి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కోవిడ్ 19 పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది.
ఈ సందర్బంగా ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కరోనా పరీక్షల గ్రాఫ్ ను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకు రావడం జరిగిందని అయన అన్నారు. ‘త్వరలోనే కరోనాను జయిస్తాం .. అందరూ ఇళ్లలోనే, సురక్షితంగా ఉండాలి’ అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలు అయినప్పటి నుండి అత్యధికంగా కోవిడ్ 19 పరీక్షలు చేస్తోన్న విషయం తెలిసిందే.
మరో పక్క కరోనా వ్యాప్తి ఏపిలో రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 16,712 మందికి కోవిడ్ 19 పరీక్షలు జరుపగా 1322 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,697గా ఉన్నది.
కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 239 చేరింది. కాగా 8920 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 10,860 మంది చికిత్స పొందుతున్నారు.
మంత్రి మేకపాటి కోవిడ్ 19 పరీక్షల గ్రాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ ల నుండి అనూహ్య స్పందన కనిపించింది. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రశంసిస్తున్నారు.