Road Accident: అదుపుతప్పిన ఓ సిమెంట్ లోడ్ ట్రక్కు రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టడంతో ఓ బస్సు లోయలో బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటడన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. రేవా – సత్తా సరిహద్దులోని బర్ఖరా గ్రామ సమీపంలో సిమెంట్ లోడ్ తో వెళుతున్న ట్రక్కు టైరు పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు బస్సులను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఒక బస్సు ఒకవైపు పడిపోగా, మరో బస్సు పక్కనే ఉన్న లోయలో బోల్తొ కొట్టింది.
ఈ బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో 14 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణీకులు సత్నా లో జరిగిన కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన ర్యాలీలో పొల్గొని తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో ప్రయాణీకులు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు బస్సులను రోడ్డు పక్కన ఆపి ఉంచగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మరో వైపు ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన రేవా మెడికల్ కళాశాల ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని పేర్కొన్న సీఎం.. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ల్లో తరలిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.