ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట బంధం ఎంతోకాలం నిలవలేదు. దానికి కారణం యువకుడికి ఇంకా మైనారిటీ తీరకపోవడమే. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. ఆమెను కౌన్సిలింగ్ కోసం ‘సఖి’ కేంద్రానికి పంపించగా ఆమె అక్కడే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొడకండ్ల మండలంలోని ఏడునూతల గ్రామానికి చెందిన శ్రీలేఖ(20) ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. వాళ్ళ కుటుంబానికి ఆమె పెద్ద కూతురు. అదే గ్రామానికి చెందిన దేశగాని మనోహర్ (20) వ్యక్తి మరియు శ్రీలేఖ ప్రేమించుకున్నారు. ఇద్దరి చదువులు పూర్తికావడంతో ఈనెల 15న ఆమె మనోహర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
అయితే ఈ నెల 16న వీరు హైదరాబాద్లో ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెతికి వారి స్వస్థలాలకు తీసుకొచ్చారు. అయితే మనోహర్కు 21 ఏళ్ల వయస్సు లేకపోవడంతో పోలీసులు అతనిని మైనర్గా నిర్దారించి ఆ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి నచ్చజెప్పారు. మనోహర్కు ఇంకో 11 నెలలలో 21 సంవత్సరాలు రానున్నందున అప్పుడు పెళ్లి చేయాలని సూచించి యువకుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.
శ్రీలేఖ ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈనెల 22న ఎస్ఐ సతీశ్ ఆమెను జనగామ సఖి సెంటర్లో కౌన్సెలింగ్ కోసం చేర్పించారు. ఆమె తీవ్ర మానసిక వేదనకు గురి అవ్వడంతో అక్కడ ఓ టాయిలెట్ డోర్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది.