తమ ప్రేమను చాటుకోవడానికి ఎంతటి సాహాసమైనా చేసేస్తుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా తమకిష్టమైన వాళ్లు ఏదైనా అడగాలే కాని ఆకాశాన్ని కూడా వాళ్ల దగ్గరకు తెచ్చేయడానికి కూడా వెనుకాడరు. అలాగే భార్యలు తమ భర్తలను ఏ కోరికైనా కోరాలే గాని అది క్షణాల్లో చేసేస్తుంటారు చాలా మంది మగవారు. దీనితో పాటుగా తమకిష్టమైన వస్తువుల విషయంలో చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తుంటారు. వాటిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటారు.
అది వస్తువు కావొచ్చు, మరేదైనా కావచ్చు. కాని దాని జీవిత కాలం అయిపోయినా కాని దాన్ని విడిచిపెట్టడానికి సాహసించరు . ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి తనకిష్టమైన వస్తువు పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి.. బీహార్ కు చెందిన ఇంతసార్ ఆలం తనకు ఎంతో ఇష్టమైన స్కార్పియో కారుపై తన కున్న ప్రేమను చాటుకున్నారు. దాంతో మహీంద్రా గ్రూప్ అధిపతి సైతం దానికి ఆకర్షితులయ్యారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వివరాల్లో కెళ్తే.. ఇంతసార్ ఆలం అనే వ్యక్తి ఎంతో ఇష్టంతో మొదటి సారిగా కొన్న స్కార్పియో కారు ఆకారంలో తన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసి అందరిని ఆశ్చర్యగొల్పుతున్నాడు. అయితే స్కార్పియో వాటర్ ట్యాంక్ నిర్మించడానికి కారణం మాత్రం తన భార్యేనట.. !
అంతే కాదండోయ్ ఈ వాటర్ ట్యాంకుకు నెంబర్ ప్లేట్ కూడా ఉండటం విశేషం. తన భార్య ఆగ్రాలో అలాంటిదే చూసి అలాంటిదే తనకు కూడా కావాలని కోరడంతో ఆలం ఈ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి తన ప్రేమను నిరూపించుకున్నాడట. దీనిని నిర్మించడానికి సుమారుగా రూ. 2.5 లక్షలు ఖర్చు చేసి స్కార్పియో వాటర్ ట్యాంక్ ను టెర్రస్ పై ఏర్పటు చేశాడట. దీనిపై మహీంద్ర తమ స్కార్పియో అంత ఎత్తుకు ఎలా చేరిందని ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ నిర్మాణం అందరినీ ఆకర్షిస్తోంది.