ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రూటే సపరేటు అని మరోసారి రుజువు చేస్తున్నారు. రాజకీయ నేతల్లో జగన్ ఫందా ఇతర నేతలకు భిన్నంగా ఉంటున్న విషయం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో ఉంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో ఉన్నదాంట్లో అంచనాలు తగ్గించుకొని నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కరోనా గిరోనా జాన్తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కరోనాకు భయపడాల్సిన పనిలేదు, కరోనా వస్తుంది, పోతుంది, కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ముఖ్యమంత్రి ఇ వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో అన్న విషయం తెలిసిందే.
కరోనా వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, ఇతర అంశాలు పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమైంది. బడ్జెట్ ను రెండు లక్షల అరవై కోట్ల రూపాయలు గా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఆ స్థాయిలో ఉంటుందని సమాచారం. ఏపి బడ్జెట్ చూసి ఢిల్లీ పెద్దలు కూడా ఆశ్చర్యపోతారేమో.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు అంచనా వేసుకున్న ఆదాయానికి వచ్చిన ఆదాయానికి పొంతనే లేదు. దాదాపుగా 70 శాతం తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ఈ ఏడాది మొత్తం కరోనా ప్రభావం ఉంటుందని అధికార వర్గాల అంచనా. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం రెండు లక్షల కోట్ల రూపాయల లోపే బడ్జెట్ అంచనాలను రూపొందించి బడ్జెట్ ను సిద్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆ ప్రతిపాదనను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో అధికారులు రెండు లక్షల అరవై వేలు కోట్ల రూపాయలుగా మార్చి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారని సమాచారం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల జాబితాను భారీగా తగ్గించినా ఏడాదికి 80 వేల కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే వచ్చే నెల నుండి సామాజిక పెన్షన్లను 250 రూపాయలు పెంచుతామని గత నెలలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తొలి ఏడాది ప్రారంభించిన డ్వాక్రా రుణమాఫీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చేయూత పథకం ఈ ఏడాదిలో ప్రారంభించాల్సి ఉంది. డ్వాక్రా రుణమాఫీకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ అవసరం. ఒకవేళ బడ్జెట్ తగ్గిస్తే పథకాలలో కోత విధించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే పాత బడ్జెట్ కన్నా ఎక్కువగానే అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా ఆర్థిక ప్రభావం రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలపై పడుతుందో లేదో చూడాలి మరి.