అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా తమ్మినేని సీతారాం, ఉప సభాపతిగా కోన రఘుపతిలను నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నుండి వీరికి స్పష్టమైన సంకేతం అందినట్లు తెలుస్తోంది.
స్పీకర్ రేసులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులు ఉన్నప్పటికీ సిఎం జగన్ తమ్మినేని పైనే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
సీనియర్ ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం సీతారాంకు ఉంది.
కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు టిడిపి నుండి, ఒక సారి స్వతంత్ర అభ్యర్థిగా, తాజాగా వైసిపి నుండి ఎమ్మెల్యేగా తమ్మినేని గెలుపొందారు.
ప్రొటెం స్పీకర్గా శంభంగి వెంకట చిన అప్పలనాయుడు నియామకం దాదాపు ఖరారైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి అప్పలనాయుడు గెలుపొందారు.
ఈ నెల 12నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.