అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. సిఎం చాంబర్లో పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత 8.50గంటలకు ముఖ్యమైన ఫైళ్లపై సిఎం జగన్మోహనరెడ్డి సంతకాలు చేయనున్నారు. 9.10గంటలకు సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు వైఎస్ జగన్ను సత్కరించనున్నారు.
9.15గంటల నుండి 11.30వరకూ సచివాలయ ఆవరణలో నూతన మంత్రులతో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలిస్తున్నారు.
సభావేదిక, గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిధులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది వరకూ వస్తారని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామని శుక్ల తెలిపారు. పాస్లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్లు లేకున్నా సామాన్యులు ప్రమాణ స్వీకారానికి హజరుకావచ్చని చెప్పారు. అతిధులందరికీ అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జెసి వివరించారు. 1500మందితో భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు.