భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ తేనేటి విందు కార్యక్రమానికి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సతీ సమేతంగా హజరు కాగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ నేతలు ఎంపి కేశినేని నాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు లతో కలిసి హజరైయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాదరంగా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఎట్ హౌోమ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మొదటి సారిగా చంద్రబాబు హజరుకావడంతో అందరి దృష్టి ఇటువైపు పడింది. అయితే సీఎం జగన్, చంద్రబాబు వేరు వేరు టేబుళ్ల ఆశీనులు కావడంతో ఎదురెదురుగా తారసపడలేదు. వైసీపీ మంత్రులు, టీడీపీ నేతలు వారివారికి కేటాయించిన టేబుళ్ల వద్ద ఆశీనులు అయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా పలకరించి, స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరో పక్క తెలంగాణ గవర్నర్ తమిళిసై హెదరాాబాద్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ పాల్గొంటున్నట్లు సీఎంఓ నుండి సమాచారం అందింది. కేసిఆర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరవుతారా లేదా అన్న సందిగ్దత కొనసాగుతున్న నేపథ్యంలో 6.30 గంటలకు ప్రగతి భవన్ నుండి కేసిఆర్ రాజ్ భవన్ కు బయలుదేరనున్నట్లు సమాచారం.