గతంలో ఈ స్థాయిలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల కమిషనర్ వెర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్న సంగతులు ఏపీలో జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రతిపక్షాలు మద్దతుగా నిలవడం.. హైకోర్టు తీర్పులు ప్రభుత్వానికి మొట్టికాయలు అని ప్రచారం చేయడంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది. దీంతో… ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం కాస్త ప్రిస్టేజ్ గానే తీసుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోవైపు ధర్మాసనం తీర్పును అమలు చేయకుండా, తాను బాధ్యతలను స్వీకరించినట్లు ఇచ్చిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం ధిక్కరించిందంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు.
తాను చార్జ్ తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై ఏజీ శ్రీరాం, ఇతర న్యాయ్య ప్రముఖులు, ప్రొఫెసర్లు, రాజ్యాంగ నిపుణులు క్లారిటీ ఇచ్చినా కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్… ఈ విషయంపై ఇంకా మొండిగానే వ్యవహరిస్తున్నారనే కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే… ఈ వ్య్యవహారంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు నిమ్మగడ్డ. ప్రస్తుతం హైకోర్టు వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించడమా లేక సెలవుల అనంతరం పిటిషన్ వేయడమా అనే అంశంపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.
కాగా… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తాను పునర్నియమించుకునే అధికారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి లేదని.. అలా స్వయంగా ప్రకటించుకోవడం కూడా చట్టవిరుద్ధమని క్లారిటీ ఇచ్చారు ఏజీ శ్రీరాం! రమేశ్ కుమార్ ను ఆ పోస్టులో మళ్లీ నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప, ఆయనే స్వయంగా వెళ్లి ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. హైకోర్టు తీర్పును అమలు పరచడానికి రాష్ట్రప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందని చెబుతున్నారు!
ఇదే వ్యవహారంపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా… రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోక ముందే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకు తాను బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకోవడం పూర్తిగా తప్పే అని.. ఆ తొందరపాటు నిర్ణయం హైకోర్టు తీర్పుకు మాత్రమే వ్యతిరేకం కాకుండా… సహజ న్యాయసూత్రాల పరంగా కూడా తప్పే అవుతుందని క్లారిటీ ఇచ్చారు. వీరి వాదన అలా ఉంటే… ధర్మాసనం తీర్పును అమలు చేయకుండా, తాను బాధ్యతలను స్వీకరించినట్లు ఇచ్చిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం ధిక్కరించిందంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో… వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!