(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించాలని ఏపి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘానికి ఏపి ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్పై మంగళవారం హైకోర్టు తీర్పను ఇచ్చింది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుమోటా ప్రతివాదిగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వం సహకరిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉండేది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ విజ్ఞప్తులపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఏ విధంగా సహకరించడం లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు కోరగా ఈసీకి రూ.40 లక్షలు రావాల్సి ఉండగా వాటిని విడుదల చేయడం లేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నుండి ఏమి కావాలో ఎస్ఈసీ మూడు రోజుల్లో ప్రభుత్వానికి తెలియజేయాలని సూచిస్తూ, ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే ప్రభుత్వం ఖశ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాదులు సీతారామూర్తి, అశ్వనీకుమార్లు వాదించారు.