AP Muncipal Elections : ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు లేకుండా జరుగుతుండటంతో గెలిచిన వారందరూ తమ వారేనని పోటిపడి మరి వైసీపీ, టీడీపీ ప్రచారం చేసుకున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీ ఎన్నికల పరిస్థితి అలా కాదు. పార్టీల ఎన్నికల గుర్తుతో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో… ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు వైసిపి, టిడిపి, కాంగ్రెస్, బిజెపి, జనసేన, వామపక్షాలు సిద్దమౌతున్నాయి. పార్టీల ఆర్భాటాలు ఎలా వున్నా… ప్రధాన పోటీ మాత్రం వైసిపి, టిడిపిల మధ్యే వుండే అవకాశం ఉంది. బిజెపి, జనసేనలు కలిసి పోటీ చేస్తుండటంతో కొంత మేర ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP Muncipal Elections : వైసీపీకి ప్రతిష్టాత్మకం!
ఈసారి అధికారంలో ఉండటంతో అత్యధిక స్థానాలపై వైసీపీ కన్నేసింది. ఇటీవల జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, మాజీమంత్రులు, వారి కుటుంబ సభ్యులు పలువురు కేసుల్లో ఇరుక్కోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టిడిపి… ఈ ఎన్నికల్లో నిలదొక్కుకోకుంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో చావో రేవో అన్నట్లుగా టీడీపీ పోరాటం చేయనుంది. ఆధిపత్యాన్ని నిలబట్టుకొని టీడీపీని మరోసారి దెబ్బ తీయాలని వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. దీంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
టిడిపికి చావో రేవో?
ఇక టిడిపి చావో రేవో అన్నట్లుగా పోరాటానికి సిద్దమైంది. ఇప్పుడు పార్టీ బలపడకపోతే రాజకీయంగానే కాదు.. భవిష్యత్లో ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నీరుగారిపోతే టిడిపి నేతలు జారిపోయే పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబు కూడా కొత్తగా హిందుత్వ అజెండాను ఎత్తుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ జగన్ మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తూ… మెజారిటీ హిందువులను తమవైపు మళ్లించుకొనే ప్లాన్ వేస్తున్నారు.
బిజెపి జనసేనలకు ఎంట్రీ పాయింట్ !
పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు ఇద్దరూ కాపులే కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బిజెపి, జనసేనకు కొంత ఆశలు వున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేసి దారుణ పరాభవాన్ని చవిచూశాయి. ఈసారి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండటంతో ఎంతో కొంత ఉనికి చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలు పెరుగుదలతో పాటు విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటికరణ నెగిటివ్గా మారే అవకాశం ఉంది.కాంగ్రెస్, వామపక్షాలకు ఈ ఎన్నికలు కొత్తగా మేలు చేసేదేమీ లేదని వారంటున్నారు.